Sunday, April 28, 2013
సి. సుజాత సాహిత్యం- స్త్రీవాద దృక్పథం
డా. కె. శ్రీదేవి,
Associate Professor
Dravidian University
మానవ
జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుధించివేస్తున్న వర్తమాన
ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోంది. దీన్ని అరుదుగా తమ కాల్పనిక సాహిత్యంలో
సృజనకారులు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో సి.
సుజాత ఒకరు. అయితే గాఢత, సాంద్రత వున్న సృజనాత్మక వ్యక్తీకరణ మరింత బలంగా, మరింత
విస్తృతంగా రావాల్సి వుంది. మూడు దశాబ్దాల క్రితం వున్న బ్రతుకు తీరుతెన్నుల్ని
గమనిస్తే ఇవాల్టి జీవితంలో అమానవీయ ధోరణి ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో
అర్థమవుతుంది. వీటిని ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావమనే పేరుతో తేలికగా
తీసుకొంటున్నారు. కాని అలా తేలికగా తీసుకోవాల్సిన
అంశం కాదు. అత్యంత వేగవంతమైన, సాంకేతిక పరిఙ్ఞానం అందుబాటులోకి వచ్చి, మనిషి జీవన ప్రమాణాన్ని పెంచింది కానీ బుధ్ధి నైశిత్యం
మాత్రం సంకుచిత పరుధులకు లోనవుతుంది. దీనిని ఎదుర్కోవడానికి తాత్విక పరమైన స్త్రీవాద సృజనాత్మక సాహిత్యం
ద్వారానే సాధ్యమవుతుంది. రచయితలు ఈ మార్కెట్ మాయాజాలానికి అతీతంగా విశేష తాత్విక అధ్యయనంతో విశాల దృష్టి కోణాన్ని
సంతరించుకోవడం ద్వారానే మంచి సృజనాత్మక
సాహిత్యం లభ్యమవుతుంది..
సామూహిక లేక నిర్థిష్ట సమాజ సంబంధమైన
విషయాలను మాత్రమే ప్రతిఫలించటం వలన, గత
రెండు దశాబ్దాల కాలంలో సాధికారత చేకూరటంతో బలమైన వ్యక్తీకరణకు స్త్రీవాద సాహిత్యం
నోచుకుంది. ఈ తరహా ఆలోచనలు గత రెండు
దశాబ్దాల కాలంలో చాలా వరకు తెలుగు
కాల్పనిక సాహిత్యంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు దోహదం చేసిన స్త్రీవాద రచనలలో సి.
సుజాత ఆలోచనలలో స్త్రీవాద దృక్పథం ప్రతిబింబించాయి.
నాలుగు దశాబ్దాలుగా కాల్పనిక
సాహిత్యాన్ని సృజిస్తున్న సి. సుజాత స్త్రీల జీవితాన్ని దాదాపు అన్ని కోణాల్నించి
విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ పార్శ్వాల నుండి విడివిడిగా రచనలు చేస్తున్న రచయితల
రచనల్లో సహజంగానే జీవితాన్ని గురించి
సమగ్ర అవగాహన వ్యక్తంకాదనే నమ్మకం వుంది.
అలాంటి అవగాహనలను, నమ్మకాలను సుజాత
సునాయాసంగా అధిగమించి కాల్పనిక
సాహిత్యాన్ని సృజించారు. సుజాత ఇంతవరకు మూడు
సంపుటాల కథా సాహిత్యాన్ని, రెండు
నవలల్ని ప్రచురించారు. ”సుజాత కథలు,
’రెప్పచాటు ఉప్పెన”, ’సుప్త
భుజంగాలు” ప్రచురించడం ద్వారా సాహిత్య ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగినారు. ఇటీవల వచ్చిన ‘నెరుసు’ కథా సంపుటి, ‘రాతిపూలు’ నవల రెండు ప్రక్రియలు
కూడా సుజాతను సీరియస్ స్త్రీవాద కాల్పనిక సాహిత్య కారిణిగా
నిలబెట్టడమే కాకుండా ఆమె తన సామర్థ్యాన్ని మరోసారి శక్తివంతంగా ఋజువు
చేసుకోగలిగింది.
స్త్రీవాదం చర్చకు పెట్టిన పితృస్వామ్య అణచివేత రూపాలైన ఇంటిచాకిరి,
లైంగికత, పునరుత్పత్తి హక్కులు లాంటి అంశాలన్నీ సుజాత సాహిత్యంలో ముఖ్యంగా ‘రెప్పచాటు
ఉప్పెన’, ‘నెరుసు’ కథా సంపుటాలలోని కథలు చాలా
బలంగా, గాఢంగా స్త్రీవాద తాత్వికతలోని వ్యక్తరూపాలుగా దర్శనమిస్తాయి సంక్లిష్ట
సంధర్భాల్లో కూడా సుజాత కథల్లోని పాత్రలు నిరాశలో మునిగిపోవు. పరిస్థితులను అర్థం
చేసుకుని, తమంతకు తామే స్వీయ చైతన్యంతో ప్రవర్తిస్తాయి. జీవితానికి కావాల్సిన
స్వేఛ్ఛా స్వాతంత్ర్యాల స్వరూపం ఎలా వుంటుందంటే అవి జీవితాన్ని కోల్పోయేంతగాకాకుండా, జీవితాన్ని కైవసం
చేసుకునేంత స్వేఛ్ఛ పొందేవిగా వుంటాయి. ఇంకా
స్పష్టంగా చెప్పాలంటే ఈమె పాత్రలు
జీవితాన్నిఎంతగా ప్రేమిస్తాయో ఆమె కథల్లోని పాత్రలన్నీ అందుకు నిర్వచనంలాగా నిదర్శనంగా
నిలుస్తాయి.
స్వేచ్ఛ అంటే జీవితాన్ని కోల్పోయేలాగా ఉండకూడదన్న అవగాహన సుజాతకు వుంది. జీవితంలో మమేకమైన స్వేఛ్ఛను తమకు కావాల్సిన లేదా పొందాల్సిన స్వేఛ్ఛ గురించి తమ పాత్రల ద్వారా శక్తిగతంగా వ్యక్తం
చేసే క్రమంలో సుజాత తాను పొందిన స్వీయ
అనుభవ చైతన్యమే ఈ కథల్లో పర్యవసించడం వలన ఈ కథలు ఇంత వాస్తవికంగా potentialగా తయారయ్యాయని చెప్పవచ్చు.
స్త్రీవాద సిధ్ధాంతం ప్రతిపాదించిన లైంగికత వైవాహిక వ్యవస్థపైన
చూపిన ప్రభావ ఫలితంగా రూపుదిద్దికున్న భావనలు (concepts) సహజీవనం (living together) స్వలింగ సంపర్కులుగా (Lesbians) ఒంటరి స్త్రీలుగా (Single women) ప్రత్యామ్నాయ జీవన
విధానాలుగా చర్చకు వచ్చాయి. ఈ
భావనలన్నింటినీ సి. సుజాత , ‘బీటెన్ ట్రాక్’, ‘చందన’, ‘నా దారిలోనే’ కథల్లో చిత్రించారు.
స్త్రీవాద రచయితగా
సుజాత మాతృత్వం పట్ల పితృస్వామ్యం
ఏర్పరచిన భావనలను బద్దలుకొట్టి, పునరుత్పత్తి క్రమంలో స్త్రీలు
వంటరివాళ్ళుగా మారుతున్న క్రమాన్ని ‘నేనొక్కదాన్నే’, ‘త్రీఇన్ ఒన్’ కథల్లో
చిత్రించారు. పెళ్ళికాకముందు స్త్రీలు చేయని పనులన్నింటినీ ఒకరు చెప్పకుండానే
చేసుకుపోయేంత తర్ఫీదును తల్లులు, నాయనమ్మలు, అత్తలద్వారా గ్రహించడం జరుగుతుంది.
అందువలననే అమ్మాయిలు ఆటోమేటిక్ గా ఆ పనుల్ని ఒకరు చెప్పకుండానే చేసుకుపోయే
తత్వాన్ని ఈ కథల్లో జెండర్ దృక్పథంతో సి. సుజాత చర్చించారు. పుట్టినప్పటి నుంచీ
అలవాటు లేని పిల్లల పెంపకం బిడ్డ పుట్టి పెరుగుతున్న కొద్దీ తమ చేతుల స్పర్శ తల్లుల
సేవల్లో వాళ్ళెంత హాయిగా, సౌకర్యంగా వుండగలరో తెలుసుకోవటం అంతెందుకు గర్భం
ధరించగానే దూకుడు తగ్గించి నడవడం దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అమ్మ
నాయనమ్మల పర్యవేక్షణలో అమ్మాయిలు తల్లులుగా రూపాంతరం చెందే క్రమాన్ని అర్థం
చేసుకోగలుగుతాం. అలాగే చదువుల విషయంలో కూడా చక్కగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించి,
వాళ్ళ సంతృప్తిని గెలుచుకోవడం, వాళ్ళందరి దృష్టిలో నమ్రత కలిగిన తెలివైన
ఆడపిల్లలుగా ఎలా తీర్చి దిద్దబడతున్న క్రమం ఈమె కథలలో వ్యక్తమవుతాయి. అందుకే ఆ నియంత్రణ ఆమెపై అధికారపూర్వకంగాకాక
ప్రేమ పూర్వకంగా సాగడం వలననే ఆ తీవ్రతను, వత్తిడిని గుర్తించలేకపోతుంది రేవతి. ఈ
వరుసలోనే, తల్లితండ్రుల పెంపకంలో పెరిగిన
ఆమె చంద్రాన్ని పెళ్ళాడిన దగ్గరి నుంచీ ఏఇబ్బందీ కలుగకుండా ఒద్దికైన
భార్యగా పేరు తెచ్చుకునే క్రమమంతా కూడా “ ఎవరినీ నొప్పించరాదనే తారకమంత్రాన్ని
పఠిస్తే” వచ్చిన అనుభవంగా గుర్తించడంలోనే రేవతి వ్యక్తిత్వం
రూపుదిద్దుకుంది. తనకు తెలియకుండా తనను కంట్రోలు చేయగలిగిన శక్తులన్నింటికి తల వంచింది. తన జీవితం తన చేతుల్లో కాక మరెవరో గీసిన
హద్దుల్లోంచి, ఇంకెవరో డిజైన్ చేసిన జీవితాన్ని ఆ చట్రంలోనే ఆమె జీవితాన్ని ఎవరో
పేక్ చేసి ఇస్తున్నారనే భావన కలిగింది. భర్త చంద్రం రేవతికి ఉద్యోగరీత్యా వచ్చిన
ప్రమోషన్ ను వద్దని చెప్పదం వలననే, ఆమె అస్థిత్వం ప్రశ్నార్థకమవుతుంది.
ఇన్నాళ్ళు స్వేఛ్ఛా జీవిగానే బ్రతుకుతున్నాననే తనను నిలబెట్టిన
విశ్వాసం ఎంత బలహీనమైనదో అర్థమవుతుంది. రేవతి పర్సనల్, పబ్లిక్ జీవితాలు రెండూ
ఎవరి కంట్రోల్లో వున్నాయో , చంద్రం ప్రమోషన్ తీసుకోవద్దని చెప్పినప్పుడు మాత్రమే
తన స్వతంత్ర పరిథి ఎంతో ఆమెకు
తెలుస్తుంది. ఇది కొంచెం సినిమాటిక్ గా అనిపించినప్పటికీ రచనలో చూపించిన నైపుణ్యం
వలన పాఠకులు ఒక లోపంగా దీనిని గుర్తించరు.
“ తన కోసం ఫిల్టర్
చేసిన కాఫీలాగా కాచి చల్లార్చి సిధ్ధం చేసిన జీవితం తన కోసం ఎవరో షేక్ చేసిన
జీవితం ...... కంప్యూటర్ లోకి ఎక్కించిన
ప్రోగ్రామ్ లాగా అక్షరం తేడా లేకుండా ఖచ్చితమైన స్టాటిస్టికల్ రిపోర్ట్” లాంటి (పే-) జీవితం తల్లి నాయనమ్మల చేతుల్లోంచి చంద్రం
చేతుల్లోకి మారి పధ్ధతిగా, నిదానంగా
చిక్కుడు పొద మీద పాకే గొంగళి పురుగులా నడిచే జీవితం తనకు వద్దనుకుంటుంది. తన జీవితాన్ని గొంగళి పురుగు లాంటిదని Identity అవ్వడం ఏ సొంత
ఆలోచనలకూ ఆస్కారం ఇవ్వని జీవితం, పొందికగా తయారయిన జీవితం, ఎలా వుంటే అందరి
మన్ననలకు పాత్రమవుతారో అలా తయారైన జీవితం. సమస్త ప్రపంచం ఏమైనాగానీ తాను మాత్రం
భద్రంగా గడపాలనే జీవితాన్ని గొంగళి పురుగు నడకతోనే కాదు రచయిత వీళ్ళంతా
వెంట్రుకలతో, నల్లగా, నింపాదిగా నడిచే గొంగళి పురుగు స్వరూప స్వభావాలన్నింటితో
తనను తాను Identity చేసుకున్న రేవతి పాత్రలో భారతదేశంలోని 90శాతం మంది మహిళలు Identity అవుతారు.
గంటకొట్టే సరికల్లా
తన కాబిన్ లో మనుషులతో సంబంధం లేని జమా ఖర్చుల బిల్లులు చేసే గుమాస్తా వుద్యోగం , మళ్ళీ గంత కొట్టే సరికల్లా ఇంట్లో
వాలిపోయే భార్య ఉద్యోగం, రాత్రి పదింటికల్లా నైటీ తగిలించుకుని శృంగారం కోసం పనికి
వచ్చే పనిముట్టుగా స్త్రీలు మారుతున్న క్రమాన్ని కనిపించని నియంత్రణకు కొనసాగింపే
స్త్రీల జీవితం అని గుర్తించడంలోనే సుజాత స్త్రీవాద దృక్పథం స్పష్టమవుతుంది.
స్త్రీవాద సిధ్ధాంతం
ప్రతిపాదించిన లైంగికత, వైవహిక వ్యవస్థపైన చూపిన ప్రభావ ఫలితంగా
రూపుదిద్దుకున్న భావనలు సహజీవనం, ఒంటరి స్త్రీగా జీవించే ప్రత్యామ్నాయ జీవన
విధానాలుగా చర్చకు వచ్చాయి. ఈ భావనలన్నింటినీ సి. సుజాత ‘బీటెన్ ట్రాక్’, ‘నా
దారిలోనే’, ‘చందన’, కథల్లో చిత్రించారు.
‘బీటెన్ ట్రాక్’. కథల్లోని విమల ప్రకాష్ తో
సహజీవనం చేయడానికి సిధ్ధపడుతుంది. కానీ పెళ్ళికి వ్యతిరేకం. ప్రకాష్ మూడేళ్ళ సహజీవనం తర్వాత సుఖవంతమైన జీవితం గడపడానికి పెళ్ళి కావాలనుకుంటాడు. కానీ
విమల తన తల్లి, అత్త, అక్క జీవితాల్లోని జవజీవాలను కుటుంబం ఎలా లాగేసిందో
గ్రహించి, పెళ్ళి వద్దంటుంది. కానీ పెళ్ళి
చేసుకోక తప్పదంటాడు. విమల అందుకు ఇష్టపడకపోతే,మరో అమ్మాయినైనా పెళ్ళాడతానంటాడు.
విమలతో జరిగిన సంభాషణను గమనిస్తే ప్రేమించిన స్త్రీ పెళ్ళికి అంగీకరించకపోయినా,
ప్రేమించకపోయినా ఎవరినైనా పెళ్ళాడడానికి సిధ్ధపడుతున్న ప్రకాష్ ది ఎలాంటి ప్రేమో,
ఇన్నాళ్ళూ అతనితో సహజీవనానికి ఎలా సిధ్ధపడిందో ఆమె చైతన్య స్థాయిని పట్టించే
అంశాలు. కాబట్టి ఇక్కడ ప్రకాష్ మాటల్ని ఖచ్చితంగా ఇక్కడ పరిశీలించాల్సిన అవసరముంది.
“ మనిద్దరి మద్య కాంట్రాక్ట్ కంటే ముందు
ప్రేమ కూడా వుంది విమల. మనం మెషీన్లం కాదు, మనుషులం పోనీ ఆ కొత్త మోజులో అర్థం
కాలేదు. ఏ లంపటం లేకుండా హాయిగా వుందని అనిపించింది. ఇందులో లోటు నాకు ఇప్పటికి
తెలిసింది. నువ్వు ఆలోచించుకో. నీకు నచ్చకపోతే నేను ఇంకో అమ్మాయిని పెళ్ళాడతాను.” (పే-89నెరుసు సుజాత కథలు) అంటాడు.
ప్రకాష్ మాటల ద్వారా పెళ్ళి తప్ప మరో
ప్రత్యామ్నాయ మార్గం లేదని అతను పట్టపడడంలోని ఆంతర్యం ఏమిటి? అన్న ప్రశ్న కలుగకపోతే
రెంటాల కల్పన సి. సుజాత కథలపై రాసిన ‘ తెలుగు కథకులు- కథన రీతులు’ అన్న వ్యాసంలో విమలదే మొత్తం తప్పనిపిస్తుంది.
బాధ్యతగా ప్రకాష్ పెళ్ళి చేసుకుంటానంటే విమలెందుకు తిరస్కరిస్తుంది? అన్న వాదమే నిజమనిపిస్తుంది. విమల స్నేహితురాలు,
పెళ్ళి ప్రసక్తి లేకుండా పూర్తికాలం ఉద్యమ
కార్యకర్తగా పనిచేసే నళినీ అభిప్రాయంతో ఏకీభవించాల్సి
వస్తుంది. ఆమె విమలకు చూపిన కారణాలు రెండు:
1. విమలకు ఒళ్ళు
కొవ్వెక్కి పెళ్ళి వద్దనటం
2. పెళ్ళి వెనుక వున్న
అభద్రతను చూసి పెళ్ళి వద్దనటం.
పెళ్ళిని భద్రతగా భావించే
వారున్నట్లుగానే, అభద్రతగా భావించే వాళ్ళు కూడా వుండటం గమనించాల్సిన విషయం.
కాబట్టి ఆమె అభిప్రాయాల్లో వాస్తవం పాళ్ళెంతుందో మనందరికీ తెల్సిన విషయమే. మరి సి.
సుజాత నళిని పాత్ర చేత ఒళ్ళు కొవ్వెక్కి
పెళ్ళి వద్దన్నట్లుగా ఎందుకు చెప్పించింది అంటే, రచయిత సమకాలీన ఉద్యమ కార్యకర్తల
అభిప్రాయాలలోని దుర్మార్గమైన వ్యాఖ్యల్ని రికార్డు చేయడం కోసమే తప్ప స్త్రీవాద వుద్యమ
చైతన్యాన్ని అందిపుచ్చుకున్నవాళ్ళెవరికీ ఇలాంటి అభిప్రాయాలు కలుగవని, ప్రత్యేకంగా
చెప్పాల్సిన పనిలేదనుకుంటాను.
విమలను నళిని దృష్టితోనో, ప్రకాశం
దృష్టితోనో చూస్తే, విమలతో జరిగే సంఘర్షణను కొంచెం కూడా అర్థం చేసుకోలేం. సమాజంలో ఇంతవరకూ
ఎలాంటి విలువలు కొనసాగుతున్నాయో ఆ విలువలకే మళ్ళీ పట్టం కట్టిన వాళ్ళమవుతాం.
సామాజికుల అభిప్రాయాల కంటే సృజనకారుల దృష్టి, అంతకంటే నిశితంగా విశ్లేషకుల
తాత్విక దృక్పథం సునిశితంగా వుంటుంది. వుండాలి. ఈ సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు
గారు గుర్తుకొస్తున్నారు.సమాజంలోని సాధారణీకరణాలను చర్చించడం కన్నా
సమస్యాత్మకమైన సంఘర్షణలను, సంక్లిష్టతలను
రచయితలు సాహిత్యీకరించినప్పుడే రచయిత సాధించే సాహిత్య ప్రయోజనం ప్రజలకు
అవసరమంటాడు. కొ.కు అభిప్రాయంతో ఏకీభవించడానికి ఎలాంటి సందిగ్దాలు వుండవు. కానీ
దాన్ని సాహిత్యానికి అనివర్తింపచేయడంలో మాత్రం మళ్ళీ మొదటికే వస్తాం. దర్నాలు
హర్తాళ్ళు నిర్వహించే వుద్యమాల్లో వున్నా నళినీ లాంటి వాళ్ళు సహజీవనాన్ని అంతకంటే
గొప్పగా తమ అవగాహనలోంచి చెప్పే అవకాశం సందేహాస్పదమే
పెళ్ళిని స్త్రీవాదులు వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అందులో వున్న
సమస్యలేమిటో మనకందరికీ తెలుసు. వాటిని
అధిగమించడానికి ప్రయత్నించే క్రమంలో ఒకే కప్పు కింద జీవించటం వలన వచ్చే సమస్యల్ని ఆచరణలో అర్థం చేసుకోకుండా
గుడ్డిగా మాట్లాడుతున్నారనిపిస్తుంది. పరిణతి చెందిన వ్యక్తిత్వాలతో, సొంత సంపాదన
, సొంత ఆలోచనలు కలిగిన స్త్రీ పురుషుల
మధ్య Flexible
relations వుండాలిగానీ
విప్పుకునే అవకాశంలేని పీటముళ్ళు కాదు. ఒక సారి పెళ్ళి అన్న బంధంలోకి వెళ్ళిన
తరువాత విడిపోవడం గానీ, కలిసి వుండడం అంత సులభంగా జరిగే పనులు కావు. ఒక జీవిత కాలానికి
సరిపోయే వేదన అందుకే దాన్నుంచి విమల విముక్తమవ్వాలనుకుంటుంది.
సహజీవనంలో ప్రకాష్ పనిని శ్రమ అయినా, ఆ పనిని
చేయగలిగింది. అలా చేయలేని రోజు దాన్ని తిరస్కరించే అవకాశం వుంటుంది. పెళ్ళిని కూడా
అలా తిరస్కరించవచ్చు కదా అనుకుంటే, ప్రకాశ్ కోరుకునే శాశ్వత బంధంలో ఇంటి చాకిరిని,
పెత్తనాన్ని తప్పకుండా ఏదో స్థాయిలో ఎంత వద్దనుకున్నా భరించాల్సే వస్తుంది. అందుకే
విమల పెళ్ళిని తిరస్కరించింది. ఇక్కడ విమలను శంకించే అవకాశమే లేదు. ప్రకాష్ తో
గడిపిన మధురానుభూతుల్నివదులుకోలేక అతనితో కలసి వుండాలనే కోరుకుంది. అని
చెప్పడానికి ఈ క్రింది వాక్యాలే సాక్ష్యం.
“ వేళ్ళ సందుల్లోంచి
ఇసుక జారిపోయినట్లుగా చూస్తూచూస్తూ వుండగానేజీవితం మొత్తం చేజార్చుకున్నట్లే
వుంది. తెల్లవారే సరికి ఇదంతా ముగిసిపోతుందా? ఇంకేమీ వుండవా? ఏ ఙ్ఞాపకాలు
మిగలకుండా, హృదయంపైన ఏ ముద్రలు లేకుండా నేనొక్కదాన్నే ఈ విశాలమైన ఆకాశం నీడలో
ఉండిపోతానా? ఆక్ట్ పస్ లా చేతులు జాస్తున్న ఈ నాలుగు గోడల మధ్య నేనిమిడి పోవడం
తప్పేనా?........ నిర్మానుష్యంగా నిశ్శబ్దంలో, ఒంటరితనంలో........” ఈ ఆలోచనా క్రమంలో
విమల మానసిక స్థితి, ఆమె గురవుతున్న సంఘర్షణల వైనం చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది.
సమాజం రూపొందించే
విలువలకు బలయ్యే వాళ్ళు వున్నట్లే ఆ విలువలను తిరస్కరించి తమకు అవసరమైన జీవితాన్ని
తాముగా రూపొందించుకునే వాళ్ళు వుంటారు. సమస్యలకు తక్షణ పరిష్కారాలు లభించనప్పుడు
వ్యక్తులు తమ సొంత పరిష్కారాలు వెతుక్కుంటారు. తమకు కావలసిన separate space ని peace ని వెతుక్కుంటారు.
విమల వెతుకులాటలోంచే తన వునికికి సంబంధించిన ప్రశ్నలు కూడా వేసుకోగలిగింది.
సాహచర్యం మాత్రమే Ultimate
solution
అని కూడా ఈ కథలో రచయిత ఎక్కడా
ప్రస్తావించలేదు. ప్రకాష్ కు “ ఎప్పటికప్పుడు తానే ఉతికించి, వండీ,
అతని మూడ్స్ కనిపెట్టి..... ఏమిటిది? ఎక్కడ తన ఉనికి? అని సంఘర్షించడంలో సహజీవనంలో
కూడా పురుషుని ఆధిపత్య ధోరణి, స్త్రీల
ఇంటి చాకిరి కొనసాగటాన్ని ప్రశ్నించటం ద్వారా సుజాత కథలలో స్త్రీవాదులు
ప్రతిపాదించిన సహజీవనం పట్ల వున్న వెర్రి భ్రమలకు గండికొట్టే ప్రయత్నం చేశారు. ఈ
కథలో సుజాత స్పష్టమైన వైఖరిని తీసుకోకుండా కేవలం చర్చను మాత్రమే కథనంగా చూపించి,
పరిష్కారం పాఠకులకే వదిలేస్తుంది.
సుజాత ‘బీటెన్ ట్రాక్’ కథాలక్ష్యం పెళ్ళి, సహజీవనాల్లో వున్న
డొల్లతనాన్ని బహిర్గతపరచడంలో స్త్రీవాద దృష్టికోణం ఏమంటే, సహజీవనం, పెళ్ళి నిర్మాణాల్లో వున్న
అణచివేత స్వరూపంలో వచ్చే మార్పు కంటే, స్వభావంలో రావాల్సినమార్పు వైపు తన
లక్ష్యాన్ని గురిపెట్టడంలోనే ఆమె స్త్రీవాద దృక్పథం వ్యక్తమవుతుంది.
స్త్రీలు తమ జీవితంలో ఎదుర్కొనే
సమస్యలను గానీ తారసపడే సమస్యల పట్ల స్త్రీలుగా వర్తించాల్సిన లేదాఅవలంబించాల్సిన
వైఖరిని తన కథల్లో ప్రదర్శించారనిపిస్తుంది. ఏవి చర్చించాల్సిన విషయాలో, ఏవి
ఉదారంగా ప్రవర్తించాల్సిన విషయాలో కూడా సి. సుజాతకు అవగాహన వుంది. అనే విషయం ఆమె
కథలు నిర్వహించిన విధానంలో వ్యక్తమవుతుంది అనడానికి నిదర్శనంగా ‘చందన కథ’ నిలబెడుతుంది. పాశ్చాత్య స్త్రీవాదులు చర్చించిన స్వలింగ సంపర్కం (లెస్బియన్) సమస్య వున్న వారిని సానుభూతితో అర్థం
చేసుకోవాలనే అభివ్యక్తి, ఆమె కథా లక్ష్యాన్ని సంవిధానాన్ని తెలుపుతుంది. ఈ కథలో చర్చకు అవకాశం లేదు. కానీ త్రీ-ఇన్ వన్
కథలో కథను నిర్వహించిన తీరుకు ఈ కథా నిర్వహణ తీరుకు వ్యత్యాసం వుంది. బీటెన్ ట్రాక్ కథను నిర్వహించిన తీరులో అవలంబించిన ఎత్తుగడ ప్రశంసనీయమైనది.
మధ్యతరగతి జీవితాన్ని
గురించి తెలుగులో చాలా విస్తృతంగా స్త్రీల కథలు వచ్చాయి. అయితే మధ్య తరగతి జీవితాన్ని చిత్రించిన కథల్లోని పాత్రలు ఆ మధ్య తరగతి చట్రంలో ఇమడలేక,
దాన్నుంచీ బయటపడలేక ఒకానొక సంక్షోభంలో కొట్టుమిట్టాడడం కనిపిస్తుంది. ఈ విలువల
చట్రాన్ని కొన్ని పాత్రలు అధిగమించి బయటపడగలిగినా ఆ తరువాత ఆ పాత్రలు ఒక నాస్టాల్జియంలో (ఙ్ఞాపకాల్లో)
మిగలటం లేక మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనడం
కనిపిస్తుంది. పాత్రల ఈ స్థితికి మౌలికంగా రచయితల మధ్యతరగతి మనస్తత్వం నుంచి బయటపడలేకపోవటం ఒక
కారణమైతే, స్త్రీ రచయితలకు మధ్య తరగతి విలువల చట్రాన్ని అధిగమించే దైర్యం లేకపోవటం కూడా మరో కారణం.
అయితే స్త్రీ రచయితలు అలా అధిగమించలేకపోవడంలోని వాస్తవాన్ని విమర్శించటంలో భాగంగా
చూడటం సరికాదు. వాస్తవ సమస్యలకు వ్యూహాత్మక పరిష్కారాలు సూచించటం అనేది కాల్పనిక
సాహిత్యంలో భాగం. ఆ పని చేయటం వలననే
వర్తమాన ప్రపంచంలో తాత్విక అవగాహన కన్నా సాహిత్య అవగాహనకు ప్రాముఖ్యం ఇవ్వటం
జరుగుతుంది.
తెలుగు కాల్పనిక సాహిత్యంలో స్త్రీ రచయితలు తాము
ముందు మధ్య తరగతి మనస్తత్వం నుండి బయటపడగలిగి వున్నట్లైతే, మధ్యతరగతి వెలుపల వున్న
జీవితాన్ని గురించి సాహిత్య వ్యక్తీకరణలు చేసి వుండేవారు. అందువలన వాళ్ళ రచనలకు
పరిమితులు ఏర్పడ్డాయి. ఈ పరిమితుల్నిఅవలీలగా అధిగమించి సి.సుజాత రంగుల ప్రపంచం
వెనుక స్త్రీల అనుభవంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలను మన ముందు ఆవిష్కరించారు.
మధ్యతరగతి ప్రపంచంలో ఏ విలువలైతే మనిషి సహజ ప్రవృత్తికి అడ్డుగా నిలుస్తాయో, ఆ
విలువల్ని చాలా సునాయాసంగా వ్యక్తీకరించటాన్ని ‘రాతిపూలు’ నవలలో చూస్తాం. ఏ విలువల
అతిక్రమణ జరిగినప్పుడు మధ్యతరగతి వత్గం గుండెలు బాదుకుంటుందో ఆ విలువల్ని (Corporate Culture) చాలా సునాయాసంగా తృణీకరించింది.
ఆ తృణీకరించడంలో కూడా డబ్బు చుట్టూ తిరిగే మాయా ప్రపంచాన్ని అది పెంచి పోషించే
కుహనా విలువల్ని తన రచనల్లో ప్రతిపాదించగలిగారు.
తొలి నవలతోనే రచయిత
తన దార్శనుకతను, రచనా పటిమను సౌందర్యాత్మకతను, వ్యాకులతను, వాస్తవికత తాలూకు
స్వాభావికతను ప్రస్పుటంగా చాటడం చాలా అరుదైన విశేషమైన సన్నివేశం. దోపిడీ పీడనల
మధ్య వుండే అవిభాజ్యతను లోతుగా మన ముందుంచింది. ఈ నవల. ‘రాతిపూలు’ నవలలోని పాత్రల
యథార్థ జీవితాన్ని అంతర్ బాహిర్ వాతావరణాన్ని, సంక్లిష్ట మానసిక సంఘర్షణలను,
సంక్షోభాలను వ్యక్తం చేస్తుంది. టాలెంట్ వుండి కూడా అవసరాల కోసం వాళ్ళ చుట్టూ
తిరిగే మహిళా కళాకారుల జీవితాల్లోని వివృత హింసా తత్వాన్ని ఆ క్రమంలో వ్యక్తమయ్యే
అనివార్యతను ఈ నవల దృశ్యమానం చేస్తుంది. ఇంతవరకూ media రంగంలో స్త్రీలు పడే
హింస పట్ల వున్న అమూర్తతను సి. సుజాత ఈ నవలలో బద్దలు కొట్టగలిగారు. ఆశ్చర్యం,
అసహ్యం. అమానవీయ అంశాల సమ్మేళనంలావున్న ప్రపంచంలోకి పాఠకుని చేయి పట్టుకుని దృశ్య మాధ్యమ రంగభూమికి
నడిపిస్తుంది.
ప్రపంచీకరణ నేపధ్యంతో సాంస్కృతిక విధ్వంసాన్ని ఈ
నవలలో ప్రతిభావంతంగా చర్చకు పెట్టగలిగింది. వర్తమాన సమాజంలో స్త్రీ శరీరం డబ్బు
ఆర్జించి పెట్టే(Comidity)
సరుకుగా
మారుతున్న క్రమాన్నిఇంతకు ముందు ప్రక్రియలో వోల్గా, కుప్పిలి పద్మ లాంటి స్త్రీవాదులు
చర్చించారు. కానీ సి.సుజాత ప్రత్యేకంగా
దిశ్య మాధ్యమాన్ని వస్తువుగా ఎంచుకోవడం వలన మరింత సూక్ష్మ పరిశీలనాక్రమాన్ని ఈ నవల
అందిపుచ్చుకోగలిగింది.
స్త్రీలు పురుషులు Career కోసం వెంపర్లాడే
క్రమంలో లైంగిక సంబంధాల్లోకి వెళుతున్న క్రమాన్ని సి. సుజాత ఈ నవలలో చర్చించారు.
శమంత పాత్ర తన అవసరాల కోసం సురేంద్రతో తనకు గల పరిచయాన్ని వ్యామోహంతో మార్చే
క్రమంలో తను నిర్వహించిన పాత్ర సురేంద్రకు గల కొత్తగా పరిచయం పెంచుకునే అవసరాన్ని
శమంత ఆసరాగా చేసుకుంటుంది. సురేంద్ర, శమంత పరస్పరం తమ సాన్నిహిత్యాన్ని అవసరాల
సంబంధంగానే భావిస్తారు. కానీ శమంత తన కుటుంబ సభ్యుల ధనదాహం కోసం సురేంద్ర relation ను కోరుకుంటుంది,
సురేంద్ర వాళ్ళ career
ను
develop చేస్తున్నానన్న
భ్రమలో స్త్రీల నుంచి వాళ్ళద్వారా మీడియారంగంలోని వాళ్ళకు అవసరమైన పెట్టుబడిగా, తన
finance వ్యాపారాన్ని
కొనసాగిస్తూ పైగా అందరి అవసరాలను సమర్ధించే వాడుగా వాళ్ళు భావించేటట్లు అన్ని
హంగుల్ని వాళ్ళకు సమకూర్చగలుగుతాడు. ఈ
వాస్తవాన్ని శమంత గ్రహించగలుగుతుంది. సురేంద్ర సృష్టించిన విషవలయం నుండి Identity తాను రక్షించుకునే క్రమంలో అతన్నే పావుగా
మలచుకుంటుంది.
సుజాత ఈ ఎత్తుగడను
సాధిఉంచడానికి, శమంత జీవితాన్ని పరాయీకరణ నుండి అధిగమించే క్రమంలో ఆమెకు మీనాక్షి
పాత్ర ఎంతగా ఉపయోగపడిందో, చంద్రశేఖర్ పాత్ర కూడా అంతే ఉపయోగపడింది. కళ పట్ల గొప్ప
భావుకత కలిగిన చంద్రశేఖర్ వాస్తవ జీవితంలో అవసరాల వెంట పరుగులు పెట్టాల్సిన అవసరం
లేనితనాన్ని ఆచరణాత్మకంగా అతని కుటుంబసభ్యులు నిర్వహించే పాత్రను శమంత అర్థం
చేసుకోగలిగింది.దృశ్య మాధ్యమ రంగం కోసం తనలోని కళా తృష్ణను ఫణంగా పెట్టలేక తల్లి
నిర్వహించే నర్సరీ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా కళను వ్యాపారం కాకుండా
కాపాడుకోగలుగుతాడు.కళను వ్యాపారంగా చూడటం, చేయటం కంటే వ్యాపారాన్ని వ్యాపారంగా
నిర్వహించేందుకు చర్దశేఖర్ సిధ్ధపడటం ద్వారాశమంత జీవితం కోల్పోకుండాచేయడంలో కూడా
ప్రత్యక్ష్యంగా తన పాత్ర ఏ మాత్రం లేకుండానే శమంతను ప్రభావితం చేయగలుగుతాడు. ఆ చైతన్యం
లోంచే భాను జీవితాన్ని శమంత తీర్చిదిద్దగలిగింది. అనడం కన్నా పరోక్షంగా శమంత భాన్
కలల ద్వారా తన జీవిత లక్ష్యాన్ని నిర్ధేశించుకోగలిగింది అనడం సమంజసం.
పెట్టుబడిరూపాలు
మారుతూ వస్తున్నాయి. మూడు నాలుగు దశాబ్దాల ముందు సాహిత్య సృజనలో దోచుకునేవాడు,
దోపిడీకి గురయిన వాడు చాలా స్పష్టంగా కనిపించేవాడు. కానీ వర్తమాన సంక్లిష్ట జీవన
వ్యవస్థలోకి పరిణమించిన ఆధునికత వ్యక్తులు తమకు తాముగానే దోపిడీకి గురవడానికి
అనుగుణంగా సిధ్ధపడటం అనేది పరిణతి చెందిన
ప్రపంచీకరణ స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది.శమంత పాత్రనుశక్తివంతంగా మలచడంలో రచయిత
స్త్రీవాద దృక్పథం ఆవిష్కరింపబడుతుంది. శమంత ఏ అవసరాల కోసం తనను తాను Comidity గా మలుచుకుందో, ఆ
చట్రంలో నుంచీ అంతే జాగ్రత్తగా బయటపడినట్లుగా చిత్రించడం వలన దృశ్య మాధ్యమ రంగంలో(media) చిద్రమవుతున్న
వాళ్ళు ప్రత్యామ్నాయ జీవన శైలుల్ని వెతుక్కోవటం ద్వారా ఈ సమస్యకు పరిశ్కారం
అందించగలిగారు
ఎక్కడా సిధ్ధాంత
రాధ్ధాంతంగానీ, ఉపన్యాస ధోరణి గానీ కనిపించకుండా వున్నది వున్నట్లుగా తన అనుభవాలను
మన ముందుంచడం ద్వారా తన దృక్పథాన్ని ప్రత్యేకంగా ఇది అని సుజాత వ్యక్తీకరించాల్సిన
అవసరం కలుగదు. తనకు పరిచయం వున్న పరిసరాలను కథా వాతావరణంగా మార్చుకోవడంలో సుజాతకు
గల నిశిత పరిశీలనాశక్తి, నైపుణ్యం ఆమె సాహిత్యంలో ఆవిష్కృతమవుతుంది. తను
చెప్పదలుచుకున్న విషయాల్ని ప్రతిపాదించడంలో ఈమెకు బలమైన (Connection) వుంది.
శరీరానికి మనస్సుకు
వున్న సంబంధాన్ని గురించి గత మూడు నాలుగు కాలంలో మౌలిక భావనలు ముందుకు వచ్చాయి. డెరిడా,
పుకోవ్ లాంటి తాత్వికులు సంప్రదాయికంగా వస్తూ వున్నకాట్రిషియన్ ద్వంద్వాన్ని
తిరస్కరించి శరీర కేంద్రకంగా అలవడిన సంబంధాలు ఎలా రూపొందుతున్నాయో,
ప్రతిఘటింపబడుతున్నాయో చర్చించారు. వీళిద్దరు
తాత్వికులు శరీరం.(Body), మనస్సు(mind) ల మధ్య వున్న ద్వంద్వాన్నితిరస్కరించారు.
పితృస్వామిక సమాజం నిరంతరం పురుషుడ్ని
మనస్సుతోను, స్త్రీని శరీరంతోనూ
గుర్తించి, జత చేస్తూ వచ్చింది. అందువల్ల స్త్రీవాదులు పితృస్వామిక వ్యవస్థలో
స్త్రీల శరీరాల మీద కొనసాగుతున్న నియంత్రణను అణచివేతను గురించి ప్రధానంగా
చర్చించారు.
1990ల నుంచి తెలుగు
సాహిత్యంలో స్త్రీవాద భావజాలం వాస్తవికతా పునాది మీద నిలబడడానికి, Second thought of
feminist out look అభివృద్ధి చెందడానికి సి. సుజాత కృషి (Contribution)ని కూడా పరిగణనలోనికి
తీసుకోవాల్సి వుంటుంది. రెండు దశాబ్దాల తెలుగు స్త్రీవాద సాహిత్యానికి, ఒక
కాల్పనిక రచయితగా ఆమె చేసిన దోహదం చాలానే
వుంది.
సాహిత్యం నవల, కథానిక
ఇలా ఆమె రచనలు ఏరూపంలో వున్నా వ్యక్తి
జీవితానికి భరోసా ఇవ్వగలగడమే కాక, వ్యక్తి భావుకతను, విశ్లేషణ శక్తిని
పెంచగలుగుతాయి. అలాగే వ్యక్తి తన Identity ని assert చేసుకోగలిగే ధీమా కూడా
ఇవ్వగలగాలి. స్త్రీల జీవితాలలో
నిర్ణయాధికారాన్ని స్వీయ యాజమాన్యాన్ని పెంచే ఈ మూడింటిని సుజాత కథల్లో చూడగలం.
రెండు దశాబ్దాల కాలం
నుంచి ఆర్థిక సరళీకృత విధానాల నేపథ్యంలో డబ్బు సంపాదన గురించి గర్వంగా
చెప్పుకున్నారు. అది సంబంధాలను నిర్ణయించే స్థితిని ఏ వ్యతిరేఖత సంఘర్షణకు అవకాశం
లేకుండా అమోదిస్తున్నారు. ఈ క్రమం గత తరానికి మింగుడు పడడం లేదు. మారుతున్న
విలువల్ని అంగీకరించడం కష్టం అందుకే శమంత, కుమారి జీవితాల్లోని Extra Marital relations ని ఆమె మిత్ర బృందం అంగీకరించినట్లుగా శకుంతల తల్లి
జీర్ణం చేసుకోలేకపోయింది. కానీ అదే తరానికి చెందిన శమంత అత్త, మామ మాత్రం తమ తరానికి అతీతంగా వ్యవహరించి, నీతి నియమాల్ని
పక్కకు నెట్టేస్తారు ఈ కథల్లోని పాత్రలు తమ జీవితాల్లో ప్రవేశించిన పరాయీకరణను
గుర్తించి వాటిపట్ల తమ నిరసనను ప్రకటిస్తాయి. క్రోటన్స్ కథలోని సౌమ్యలోని భావుకత
డబ్బు సంపాదనలో
Burden గా
అనిపిస్తుంది. స్వాతి burden relevant గా అనిపిస్తుంది. Hero కు Self Centered, career
oriented Generation Marge అయిన క్రమాన్ని ఈ కథల్లో సి. సుజాత
నిరూపించడం జరిగింది.
సుజాత సాహిత్యంలో
వస్తు శిల్పాల ఐక్యత ప్రశంసించాల్సిన విషయం. అభివృధ్ధికరమైన భావాలతో కూడిన వస్తువు
ఎంత అవసరమో ఆ భావాలను ప్రకటించడానికి రచయిత అనుసరించే ప్రక్రియా, రచనా శిల్పం లోప
రహితంగా వుండటం అంతే అవసరం. చిన్న కథకు సరిపోయే యితివృత్తంలో నవల రాయటం, నవల
రాయటానికి సరిపోయే విశేషాలను చిన్న కథలో ఇరికించడం. ఈ రెండూ ప్రక్రియల్లో రచయితలు చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. కానీ సుజాత
కథల్లో వస్తు పరిథిని, ప్రయోజనాన్ని కూడా ఆమె గమనంలో వున్నాయని ఆమె అధ్యయనం
చేసుకున్నప్పుడు తెలిసే విషయం. రచయిత
ముందుగా తాను తన రచనల వల్ల సాధించదల్చిన ప్రయోజనాన్ని గురించి స్పష్టంగా తెలిసినపుడే దాన్ని సాధించడానికి
ఏ ప్రక్రియా నిర్మాణం ఆ ఆలోచనకు సరిపోతున్న అవగాహన కలిగి వుంటారు. వర్తమాన కథా
రచయితలు చాలా మంది ఈ విషయంలో పొరపాట్లు చేస్తూనే వున్నారు.
కానీ సుజాత తాను
చూసిన జీవితాన్ని ఆవిష్కరించటానికి ఆమె ఎన్నుకున్న పాత్రలు, ఆ పాత్రల భావాలు,
సన్నివేశ కల్పనలు, సంభాషణలు ఆమె సాహిత్య శిల్పాన్ని సమర్థవంతంగా మలచగలిగాయి.
పాత్రల భావాలకు, పాఠకులకు మధ్య అడ్డుగోడగా
నిలచే వారెవరూ వుండరు. ఎలాంటి గందరగోళం. అస్పష్టతా లేకుండా పాత్రల స్వభావాలు
పాఠకులకు అర్థమవుతాయి. స్త్రీల వుద్యమాలతో,
స్త్రీల సమస్యల పట్ల సహానుభూతి వుంది.
అలా లేనిపక్షంలో ఇంత శక్తివంతంగా స్త్రీల సమస్యలను ఆవిష్కరించలేరు. పాత్రల
అనుభూతులతో కలసిపోయి వుండటం వలననే ఆసక్తి పెరుగుతుంది. ఎక్కడా ఈమె శైలిలో కఠినమైన,
కృత్రిమమైన పదాలకు గానీ భావాలకు గానీ ఆస్కారం లేకుండా చాలా సహజంగా అలవోకగా రచన
చేయటం ఈమె ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వలననే ఈమె సాహిత్యం తెలుగు స్త్రీవాద సాహిత్య
గమనం ఉదారవాద దశ నుంచీ సోషలిస్టు స్త్రీవాద భావజాల ఆవిష్కరణతో తన గమ్యాన్ని
నిర్దేశించుకోవడం వలన స్త్రీవాద సాహిత్య సృజనలో విశిష్ట స్త్రీవాద రచయితగా తన స్థానాన్ని పదిలంగా
పొందగలిగారు.
Friday, April 19, 2013
Thursday, March 28, 2013
Thursday, March 21, 2013
Monday, March 18, 2013
Friday, October 14, 2011
నేను చాలా ధైర్యంగా రాస్తున్నానని ఆశ్చర్యపోయి మెచ్చుకుంటున్నవాళ్ళకి కృతజ్ఞతలు. ముప్ఫైయేళ్ళుగా మీడియాలో పనిచేస్తున్నాను. రూరల్ జర్నలిస్ట్లూ.. డెస్క్వాళ్ళూ.. రిపోర్టర్లూ.. నేను పనిచేసిన ఏరియాలన్నీ, మన ఇంట్లొ మనం స్వేచ్చగా తిరిగినట్లే వుంటుంది నాకు. జర్నలిస్టులన్నవాళ్ళు ఎలా వుండకూడదో.. ఎలా వుంటే బఫూన్లయిపోతారో రాస్తున్నానంతే. నా కొలీగ్స్ కోపం తెచ్చుకోరు. పైగా ఎవరు రాస్తే కోపం వస్తుందీ... ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టి, నాకంటే మిగతావాళ్ళు అల్ఫమానవులు.. నాకే బాగా తెలుసు.. నేనొక్కడినే కరక్ట్ అనుకొని ఇతరులపైన పడిపోతేనే ఎవళ్ళకైనా కోపమొస్తుంది. నా కథలు చదివారు. ఆ ఆడవాళ్ళందరి కష్టంలో నేనున్నాను. నాదీ అదే కష్టం. అందుచేత అవి సుజాత కథలు.. ఇవి మీడియా కథలు.
మనుష్యుల బలహీనతలపైన ఏ వ్యాపారమైనా జరుగుతుంది. జర్నలిజం విలువలదగ్గరనుంచి.. పత్రికలూ మీడియా వ్యాపారంలోకి మారిపోవడం కళ్ళారా చూసాను. ఈ వ్యాపారంలో ఉద్యోగులం అందరం భాగస్వాములం. ఒకళ్ళు ఒక బిజినెస్ పెట్టుకొంటే దాన్ని వృద్దిచేసే క్రమంలో పనిచేస్తున్నట్లు మేమూ అంతే. కథలు రాస్తే డబ్బులు రావు. పుస్తకాలు వేస్తే డబ్బు రాదు. రచయితలు వాళ్ళని వాళ్ళు పోషించుకొని, ప్రమోట్ చేసుకొని, వాళ్ళకోసంవాళు సమాజం పెట్టుకొని బతకాల్సిన రోజులివి. రాయటం మనకిష్టమైన వ్యాపకం అయినప్పుడు ఎలాగోలా కీర్తికోసమైనా రాస్తున్నామా లేదా..? ఉద్యోగం అవసరమైనప్పుడు బాగాలేకపోయినా దరిద్రం అనుకొంటూ చేస్తున్నామా లేదా..? మనమేం ప్రత్యేకమైనవాళ్ళం కాదు. మన అందరం ఒకటే.. ఒకే అచ్చు బొమ్మలం. 'నేను స్పెషల్ బాబూ .. మనం అలా ఉండలేమండీ.. ప్రపంచంలో బొత్తిగా మంచితనం పోయింది..' అని ఇలాంటి నిట్టూర్పులు విడుస్తూ చుట్టూ బోలెడుమంది. ఈ అబద్దాలని చచ్చినట్టు వింటాం. బ్లాగ్లో సరదాగా ఏదైనా రాద్ద్దామనుకొన్నాను. మనల్ని బోరుకొట్టే అతిగాళ్ళని మీడియాతో ముడిపెట్టానంతే.
మనుష్యుల బలహీనతలపైన ఏ వ్యాపారమైనా జరుగుతుంది. జర్నలిజం విలువలదగ్గరనుంచి.. పత్రికలూ మీడియా వ్యాపారంలోకి మారిపోవడం కళ్ళారా చూసాను. ఈ వ్యాపారంలో ఉద్యోగులం అందరం భాగస్వాములం. ఒకళ్ళు ఒక బిజినెస్ పెట్టుకొంటే దాన్ని వృద్దిచేసే క్రమంలో పనిచేస్తున్నట్లు మేమూ అంతే. కథలు రాస్తే డబ్బులు రావు. పుస్తకాలు వేస్తే డబ్బు రాదు. రచయితలు వాళ్ళని వాళ్ళు పోషించుకొని, ప్రమోట్ చేసుకొని, వాళ్ళకోసంవాళు సమాజం పెట్టుకొని బతకాల్సిన రోజులివి. రాయటం మనకిష్టమైన వ్యాపకం అయినప్పుడు ఎలాగోలా కీర్తికోసమైనా రాస్తున్నామా లేదా..? ఉద్యోగం అవసరమైనప్పుడు బాగాలేకపోయినా దరిద్రం అనుకొంటూ చేస్తున్నామా లేదా..? మనమేం ప్రత్యేకమైనవాళ్ళం కాదు. మన అందరం ఒకటే.. ఒకే అచ్చు బొమ్మలం. 'నేను స్పెషల్ బాబూ .. మనం అలా ఉండలేమండీ.. ప్రపంచంలో బొత్తిగా మంచితనం పోయింది..' అని ఇలాంటి నిట్టూర్పులు విడుస్తూ చుట్టూ బోలెడుమంది. ఈ అబద్దాలని చచ్చినట్టు వింటాం. బ్లాగ్లో సరదాగా ఏదైనా రాద్ద్దామనుకొన్నాను. మనల్ని బోరుకొట్టే అతిగాళ్ళని మీడియాతో ముడిపెట్టానంతే.
Wednesday, October 12, 2011
'చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయరా...' గర్జించాడు మా చీఫ్.
ఆయనకు రూరల్ రిపోర్టర్స్ పైన బహు ప్రేమ. ఆయన కేంప్కు వెళితే వాళ్ళంతా ఆయనను నెత్తిన పెట్టుకొని ఊరేగించినంత పని చేస్తారట.
'మీరా బైట్ చూసారా..' అన్నాను.
'పానశాలా... పాఠశాలా..అనే టైటిల్ కూడ పంపేశాడండి. ఎంత బావుందో చూడండి. వాళ్ళ భవిష్యత్ కాస్త పట్టించుకోండి. వాళ్ళు చిన్నవాళ్ళండి. ఎంత కష్టపడి ఆ న్యూస్ కవర్చేసాడో పాపం...' అన్నాడు మా చీఫ్.
ఆయన గొంతు బాధతో వణికింది.
'వేస్తే ప్రొబ్లం...' అని అంటున్నానోలేదో...
'ఏమండీ మీరు పై ఎత్తున కూర్చున్నారండీ.. ఎవరినైనా తొక్కేయగలరు. ఆ నున్న రిపోర్టర్ ఫోన్ల పైన ఫోన్లు. నేను కవర్చేసిన న్యుస్ మా వూళ్ళో సంచలనం. బిగ్ షాట్స్ వున్నారు అన్నాడు.. ఇవ్వాళ్టి రూరల్ న్యుస్లో ఇచ్చేయండి. పర్లేదండి, వాళ్ళ పైన నాకు నమ్మకముంది....' ఇది సుగ్రీవాజ్ఞ అన్నట్టు అన్నాడాయన మొహం మాడ్చుకొని.
ఏం చెప్పాలో నాకర్ధం కాలేదు. అప్పటికీ 'వేస్తే వాణ్ణి తంతారండి' అన్నాను కూడా.
'వాళ్ళు రిపోర్టింగ్లో వున్నారు.. ఆ మాత్రం గట్స్ వుంటాయి వాళ్ళికి...' అన్నాడు ఖచ్చితంగా.
నున్న రిపోర్టర్కి నూకలు చెల్లిపోతాయని నిశ్చయం చేసేసుకొని.. ఆ బైట్ ఎడిట్ చేసి డ్రాప్లో వేయమని చెప్పేసాను.
'ఆ నున్నగాడి బైట్ చూసారా' అంటూ వచ్చాడు షిప్ట్ ఇన్చార్జ్ శంకర్.
'స్కూల్లో కూర్చుని వాళ్ళ ఊళ్ళోవాళ్ళు పుల్గా తాగుతున్నారు. ఎవరిదో పెళ్ళనుకుంటా. వూరి సగం జనం అక్కడే ఉన్నారు....'
'నేను చెప్పాను బాబూ .. చిన్న వాళ్ళని తొక్కేస్తున్నానని చీఫ్ మండి పడ్డాడు...' అన్నాను.
'తొక్కటం కాదు.. ఆ ఊళ్ళోవాళ్ళే వీడి తోలొలిచేస్తారు.. ' అంటూ లేచిపోయాడు శంకర్.
మధ్యాహ్నం న్యుస్లో 'ఇది పానశాలా.. పాఠశాలా...!' అద్భుతంగా వచ్చేసింది.
స్కూళ్ళనీ, పంచాయితీ ఆఫీసుల్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారో చూడమని మా న్యుస్ రీడర్ అదిరిపోయే లీడ్ ఇచ్చేసాడు.
మంచి కెమేరామెన్ని హైర్ చేసాడనుకుంటా.. డబ్బులిచ్చాడనే గౌరవంకొద్దీ.. మా నున్న రిపోర్టర్ని వెనకాలే ఫాలోచేసి.. అతన్ని అందమైన యాంగిల్స్లో లాగించేసాడు. ఎడిట్ చేసే అవకాశం లేదు.
తాగేవాళ్ళు.. నున్న.., తాగిపడిపోయినవాళ్ళూ.. నున్న.., స్కూల్ బిల్డింగ్.. లైటూ.. అన్నీ వైడ్ షాట్స్... యధాతధంగా టెలీకాస్ట్ చేసేశాం.
ఎలాగోలా ఎప్పుడైనా మీ చానల్లో మమ్మల్ని చూపించరా వెధవా అని బుద్ధిలేక అడిగారే అనుకో... 'రాత్రిపూట ఎవ్వళ్ళూ లేరుకదాని ఆ స్కూల్లో కూర్చుని ప్రశాంతంగా మందు పుచ్చుకొంటుంటే.. దాన్ని ప్రపంచానికి చాటుతావురా చచ్చినాడా' అని వాళ్ళ మొగుళ్ళను అప్రతిష్టపాలు చేసినందుకు ఆడాళ్ళంతా కలసి నున్న గాడిని తన్నేశారట.
'ఇలా దౌర్జన్యం చేస్తున్నారు మిమ్మల్ని టీవీలో చూపెడతాను ' అన్నాడట నున్న.
'మోడ్రన్ మాలక్ష్మిలో ట్రై చేయిరా అని నాలుగు నెల్లనుంచీ నీకు అరిసెలూ, లడ్లూ మేపుతుంటే మెక్కి, నయా పైసా పనిచేయకుండా మమ్మలిని ఇలా గ్లామర్ లేకుండా చూపిస్తానంటావా ' అని రెండో విడత వాయించేశారట ఆడాళ్ళు.
నున్నకి హైద్రాబాద్లోనే వైద్యం.
ఖర్చులు ఆఫీసే భరించింది.
చీఫ్ స్వయంగా వెళ్ళి అయన్ని పరామర్శించాడు.
ఎలా పలకరించాలో తెలియక మేం మాత్రం మొహం చాటేశాం.
ఆయనకు రూరల్ రిపోర్టర్స్ పైన బహు ప్రేమ. ఆయన కేంప్కు వెళితే వాళ్ళంతా ఆయనను నెత్తిన పెట్టుకొని ఊరేగించినంత పని చేస్తారట.
'మీరా బైట్ చూసారా..' అన్నాను.
'పానశాలా... పాఠశాలా..అనే టైటిల్ కూడ పంపేశాడండి. ఎంత బావుందో చూడండి. వాళ్ళ భవిష్యత్ కాస్త పట్టించుకోండి. వాళ్ళు చిన్నవాళ్ళండి. ఎంత కష్టపడి ఆ న్యూస్ కవర్చేసాడో పాపం...' అన్నాడు మా చీఫ్.
ఆయన గొంతు బాధతో వణికింది.
'వేస్తే ప్రొబ్లం...' అని అంటున్నానోలేదో...
'ఏమండీ మీరు పై ఎత్తున కూర్చున్నారండీ.. ఎవరినైనా తొక్కేయగలరు. ఆ నున్న రిపోర్టర్ ఫోన్ల పైన ఫోన్లు. నేను కవర్చేసిన న్యుస్ మా వూళ్ళో సంచలనం. బిగ్ షాట్స్ వున్నారు అన్నాడు.. ఇవ్వాళ్టి రూరల్ న్యుస్లో ఇచ్చేయండి. పర్లేదండి, వాళ్ళ పైన నాకు నమ్మకముంది....' ఇది సుగ్రీవాజ్ఞ అన్నట్టు అన్నాడాయన మొహం మాడ్చుకొని.
ఏం చెప్పాలో నాకర్ధం కాలేదు. అప్పటికీ 'వేస్తే వాణ్ణి తంతారండి' అన్నాను కూడా.
'వాళ్ళు రిపోర్టింగ్లో వున్నారు.. ఆ మాత్రం గట్స్ వుంటాయి వాళ్ళికి...' అన్నాడు ఖచ్చితంగా.
నున్న రిపోర్టర్కి నూకలు చెల్లిపోతాయని నిశ్చయం చేసేసుకొని.. ఆ బైట్ ఎడిట్ చేసి డ్రాప్లో వేయమని చెప్పేసాను.
'ఆ నున్నగాడి బైట్ చూసారా' అంటూ వచ్చాడు షిప్ట్ ఇన్చార్జ్ శంకర్.
'స్కూల్లో కూర్చుని వాళ్ళ ఊళ్ళోవాళ్ళు పుల్గా తాగుతున్నారు. ఎవరిదో పెళ్ళనుకుంటా. వూరి సగం జనం అక్కడే ఉన్నారు....'
'నేను చెప్పాను బాబూ .. చిన్న వాళ్ళని తొక్కేస్తున్నానని చీఫ్ మండి పడ్డాడు...' అన్నాను.
'తొక్కటం కాదు.. ఆ ఊళ్ళోవాళ్ళే వీడి తోలొలిచేస్తారు.. ' అంటూ లేచిపోయాడు శంకర్.
మధ్యాహ్నం న్యుస్లో 'ఇది పానశాలా.. పాఠశాలా...!' అద్భుతంగా వచ్చేసింది.
స్కూళ్ళనీ, పంచాయితీ ఆఫీసుల్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎలా వాడుతున్నారో చూడమని మా న్యుస్ రీడర్ అదిరిపోయే లీడ్ ఇచ్చేసాడు.
మంచి కెమేరామెన్ని హైర్ చేసాడనుకుంటా.. డబ్బులిచ్చాడనే గౌరవంకొద్దీ.. మా నున్న రిపోర్టర్ని వెనకాలే ఫాలోచేసి.. అతన్ని అందమైన యాంగిల్స్లో లాగించేసాడు. ఎడిట్ చేసే అవకాశం లేదు.
తాగేవాళ్ళు.. నున్న.., తాగిపడిపోయినవాళ్ళూ.. నున్న.., స్కూల్ బిల్డింగ్.. లైటూ.. అన్నీ వైడ్ షాట్స్... యధాతధంగా టెలీకాస్ట్ చేసేశాం.
ఎలాగోలా ఎప్పుడైనా మీ చానల్లో మమ్మల్ని చూపించరా వెధవా అని బుద్ధిలేక అడిగారే అనుకో... 'రాత్రిపూట ఎవ్వళ్ళూ లేరుకదాని ఆ స్కూల్లో కూర్చుని ప్రశాంతంగా మందు పుచ్చుకొంటుంటే.. దాన్ని ప్రపంచానికి చాటుతావురా చచ్చినాడా' అని వాళ్ళ మొగుళ్ళను అప్రతిష్టపాలు చేసినందుకు ఆడాళ్ళంతా కలసి నున్న గాడిని తన్నేశారట.
'ఇలా దౌర్జన్యం చేస్తున్నారు మిమ్మల్ని టీవీలో చూపెడతాను ' అన్నాడట నున్న.
'మోడ్రన్ మాలక్ష్మిలో ట్రై చేయిరా అని నాలుగు నెల్లనుంచీ నీకు అరిసెలూ, లడ్లూ మేపుతుంటే మెక్కి, నయా పైసా పనిచేయకుండా మమ్మలిని ఇలా గ్లామర్ లేకుండా చూపిస్తానంటావా ' అని రెండో విడత వాయించేశారట ఆడాళ్ళు.
నున్నకి హైద్రాబాద్లోనే వైద్యం.
ఖర్చులు ఆఫీసే భరించింది.
చీఫ్ స్వయంగా వెళ్ళి అయన్ని పరామర్శించాడు.
ఎలా పలకరించాలో తెలియక మేం మాత్రం మొహం చాటేశాం.
Subscribe to:
Posts (Atom)